తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి

రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలిగిస్తే బాగుంటుందన్న ఎంకే స్టాలిన్‌;

Advertisement
Update:2025-03-05 12:11 IST

కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విదానం (ఎన్ఈపీ) అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉన్నది. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి కేంద్రంపై ఫైర్‌ అయ్యారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీ తొలిగించాలన్నారు. తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపెట్టాలని ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

ప్రధాని నరేంద్రమోడీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతున్నది. అదే నిజమైతే.. దాన్ని ఆయన చేతల్లో ఎందుకు చూపించడం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలిగిస్తే బాగుంటుంది. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి.. మరిన్ని నిధులు కేటాయించండి. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులు అందించాలి. రైళ్లకు అంత్యోదయ, తేజస్‌, వందేభారత్‌ వంటి పేర్లు పెట్టడం ఆపండి. దానికి బదులు తమిళ పేర్లను పెట్టండి. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలి

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోడీని స్టాలిన్‌ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం.. పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోయి.. 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమిళ రాజకీయాలపై జరిగే ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు. ఈ చర్య రాష్ట్ర గొంతును నొక్కేస్తుందన్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని, గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన తమను శిక్షించకూడదన్నారు. ఈ సందర్భంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది.

Tags:    
Advertisement

Similar News