తెలంగాణకు రూ.11.713.49 కోట్ల వరద సాయం చేయండి

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

Advertisement
Update:2024-10-07 20:40 IST

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిన్నదని, రోడ్లు, ఇతర మౌలిక వసతుల పునరుద్దరణ, రిపేర్ల కోసం రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో అమిత్‌ షాతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఆగ‌స్టు 31 నుంచి నుంచి సెప్టెంబ‌ర్‌ 8 వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్ర‌భావం చూపించాయని, 37 మంది చనిపోయార‌ని తెలిపారు. ల‌క్ష‌కు పైగా ప‌శువులు, ఇత‌ర మూగ జీవాలు మృతిచెందాయ‌ని విరవించారు. 4.15 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటకు నష్టం వాటిల్లిందని, రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంట‌లు, కాలువ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకండా తమ ప్రభుత్వం తాత్కాలిక పనులు చేసిందని తెలిపారు. ఆయా ప‌నుల‌కు రూ.5,438 కోట్లు విడుద‌ల చేయాల‌ని సెప్టెంబ‌ర్‌ రెండో తేదీన తాను లేఖ రాశానని గుర్తు చేశారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం వరదలతో రూ.11,713 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింద‌ని సెప్టెంబ‌ర్‌ 30న నివేదిక ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.416.80 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులతో ముడిపెట్టకుండా రోడ్లు, ఇతర పనులు రిపేర్లు చేయడానికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత (ఎల్‌డ‌బ్ల్యూఈ) జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల‌ను ఎల్‌డ‌బ్ల్యూఈలో తిరిగి చేర్చాల‌ని కేంద్ర హోం మంత్రిని సీఎం కోరారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌తో తెలంగాణ‌కు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉంద‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు. 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దుల్లోని మ‌లుగు జిల్లా పేరూరు, ములుగు, క‌న్నాయిగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ప‌లిమెల‌, మహా ముత్తారం, కాటారం లాంటి పోలీస్ స్టేష‌న్ల‌ను బ‌లోపేతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కొత్త‌గా నియ‌మితులైన పోలీసులకు గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నామని తెలిపారు. 2024-25 సంవ‌త్స‌రంలో ఈ ర‌క‌మైన శిక్ష‌ణ‌కు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవ‌స‌ర‌మ‌ని, ఆ మొత్తాన్ని విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా పోలీసు బలగాలను తీర్చిదిద్దే ప‌నుల‌కు ఉద్దేశించిన ప్ర‌త్యేక మౌలిక‌ వ‌స‌తుల ప‌థ‌కం (ఎస్ఐఎస్‌)కు తెలంగాణ‌కు కేవ‌లం రూ.6.70 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశార‌ని, అవి ఏమాత్రం స‌రిపోవ‌ని తెలిపారు. వాటికి అద‌నంగా రూ.23.56 కోట్లు విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాలని కోరారు. సీఎం వెంట ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, సీఎంవో సెక్రటరీ శేషాద్రి, డీజీపీ జితేంద‌ర్ ఉన్నారు.

హైదరాబాద్‌ సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ ను అమృత్‌ 2.0 లో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. రూ.17 వేల కోట్లతో 7,444 కి.మీ.ల మేర సీఎస్‌ఎంపీ ప్రణాళిక రూపొందించామన్నారు. డీపీఆర్‌ ను పరిశీలించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగునీటిని శుద్ధి చేసే పనులను రూ.4 వేల కోట్లతో చేపట్టనున్నామని, దీనికి సాయం చేయాలని కోరారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణకు 50 శాతం నిధులు ఇవ్వాలని, దీనికి సంబంధించిన డీపీఆర్‌ త్వరలోనే అందజేస్తామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News