ఏప్రిల్ 8,9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు
ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్న కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక కానున్నది. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏప్రిల్ 8,9 తేదీల్లో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు 'ఎక్స్'లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
ఈ కీలక భేటీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలను ఒకచోటకు చేర్చడమే కాకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై నిరంతరం జరుగుతున్న దాడిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు.