చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మృతి!

తీవ్ర రద్దీ, ఉక్కపోతతో సొమ్మసిల్లి పడిపోయిన సుమారు 230 మంది

Advertisement
Update:2024-10-06 21:46 IST

తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్‌ షో ను వీక్షించడానికి లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడింది. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందగా.. అనేకమంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్ర రద్దీ, ఉక్కపోతతో సుమారు 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఎయిర్‌ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అంచనా.

మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసింది. కానీ సాయంత్రం వరకు ట్రాఫిక్‌ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించడానికి ఇబ్బంది ఎదురైంది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్‌ సమీపంలోని లైట్‌ హౌస్‌ మెట్రో స్టేషన్‌, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం వేలాదిమంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంలపై నిలబడటానికి వీలులేని పరిస్థితి నెలకొన్నది. అన్నా స్క్వేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.

Tags:    
Advertisement

Similar News