యూపీలో ఘోరం.. తొక్కిసలాటలో 100 మంది మృతి

హథ్రాస్‌ జిల్లా సికింద్రారావు సమీపంలోని ఫుల్‌రాయ్‌ గ్రామంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న భోలే భాబాకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.

Advertisement
Update: 2024-07-02 15:27 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా తీవ్ర గాయాల పాల‌య్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. హృదయ విదారకంగా ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

హథ్రాస్‌ జిల్లా సికింద్రారావు సమీపంలోని ఫుల్‌రాయ్‌ గ్రామంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న భోలే భాబాకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ప్రార్థనా కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. బయటకు వెళ్లే దారి ఎత్తులో, ఇరుకుగా ఉండడంతో పాటుగా పక్కనే లోతైన డ్రైనేజ్‌ ఉందని, ఒకేసారి వందల మంది తోసుకురావడంతో చాలా మంది అందులో ఒకరిపై ఒకరు పడి చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక ప్రార్థన స్థలం నుంచి ముందుగా బాబా వెళ్లేంత వరకు జనాలను ఆపి ఒకేసారి వదిలినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌ నాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక నిర్వహకులపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News