మనోజ్ ఫిర్యాదులో నిజం లేదన్న నిర్మల
ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు లేఖ;
మోహన్ బాబు కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల మొదటిసారి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉన్నదో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉన్నది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా 'మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదని అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.
తన తల్లి నిర్మల పుట్టిన రోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం ఓ ప్రెస్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు.విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్ లో చెక్కర పోయించి, కరెంట్ సరఫరా నిలిపివేయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.