అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.. బాలయ్య పంచ్ డైలాగులు

గత ప్రభుత్వ హయాంలోనే దాడులు జరిగాయంటున్నారు బాలకృష్ణ. ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, హత్యలు చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు.

Advertisement
Update:2024-06-10 17:36 IST

హిందూపురం అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఏనాడూ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వల్ల నియోజకవర్గానికి జరిగిన మంచి ఏమీ లేదని అంటుంటారు స్థానికులు. అయినా కూడా ఆయన వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి మరిన్ని పంచ్ డైలాగులు విసిరారు బాలయ్య. ఇకపై అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.

లేపాక్షిలో ఉత్సవాలను తిరిగి ప్రారంభిస్తానన్నారు బాలకృష్ణ. తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. హ్యాట్రిక్ విజయాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని, కనీసం రోడ్లను కూడా పట్టించుకోలేదనన్నారు. రవాణా వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుపడుతుందని ఆనాడు ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, అందుకే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు బాలయ్య. ప్రజల నుంచి స్పందన నిశ్శబ్ధ సునామీ లాగా వచ్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి అలలు ఎగసినట్టు ప్రజలు భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు.

దాడుల సంస్కృతి వారిదే..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలోనే దాడులు జరిగాయంటున్నారు బాలకృష్ణ. ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, హత్యలు చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. టీడీపీ శ్రేణులు ఎప్పుడూ హింసా మార్గాన్ని ఎన్నుకోవని చెప్పారు బాలకృష్ణ. 

Tags:    
Advertisement

Similar News