గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి : వైఎస్ షర్మిల
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలంటూ హైదరాబాద్లోని అశోక్నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలంటూ అభ్యర్థులు నేడు హైదరాబాద్లోని అశోక్నగర్ స్టడీ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు.
తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు షర్మిల.