గుళ్లు కూల్చిన మీరా హిందుత్వంపై మాట్లాడేది " టీడీపీపై వీర్రాజు ఫైర్

అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథం అగ్నికి ఆహుతి అవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హిందుత్వం విషయంలో మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో రక్షణ ఆంజనేయస్వామి విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కూల్చేసిందన్నారు. సీతమ్మపాదాలను పెకిలించివేశారన్నారు. […]

Advertisement
Update:2020-09-08 08:10 IST

అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథం అగ్నికి ఆహుతి అవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

హిందుత్వం విషయంలో మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో రక్షణ ఆంజనేయస్వామి విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కూల్చేసిందన్నారు. సీతమ్మపాదాలను పెకిలించివేశారన్నారు. పదుల సంఖ్యలో ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసిందని గుర్తు చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

దేవాలయాలను కూల్చేశారని ఆ ప్రాంతానికి వెళ్తే బుద్దా వెంకన్న తన కార్యకర్తలతో కలిసి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని సోమువీర్రాజు గుర్తు చేశారు. కూల్చిన గుళ్లలో ఒక్క గుడైనా చంద్రబాబు తిరిగి కట్టించారా అని ప్రశ్నించారు.

ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అంటూ మేనిఫెస్టోలో చెప్పిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీల్లో హిందువులంటూ ఎవరూ మిగలరని తెలిసి కూడా చంద్రబాబు ఇలాంటి హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయంలో టీడీపీ, వైసీపీ రెండూ ఒకటేనని విమర్శించారు.

జీవీఎల్‌కు బ్రదర్‌ అనిల్ కుమార్‌కు మధ్య బంధుత్వం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం…. వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఆ సమాచారం ఆధారంగానే బ్రదర్ అనిల్‌కు జీవీఎల్ మేనమామ అంటూ ప్రచారం చేశారని సోమువీర్రాజు విమర్శించారు. క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసిన టీడీపీనే ఇప్పుడు హిందూమతం గురించి ఆందోళన చెందుతోందని ఎద్దేవా చేశారు. 1996లో లక్ష్మీపార్వతి పార్టీ తరపున పోటీ చేసి ప్రపంచంలో చంద్రబాబును ఎవరూ తిట్టనంతగా బుచ్చయ్యచౌదరి తిట్టారని గుర్తు చేశారు.

ప్రపంచంలో చాలా రాజధానులు మారుమూల పల్లెల్లో ఉన్నాయన్నారు. చాలా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానుల ఏర్పాటు చాలా సైలెంట్‌గా జరిగిపోయిందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధానిలా కడుతామంటూ లేనిపోని హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. 7వేల 200 కోట్లతో రాజధానిలో ఏం కట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని… జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తాయని సోమువీర్రాజు ప్రకటించారు.

వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు పెంచాల్సిన అవసరం ఇంకా చాలా ఉందన్నారు. అందుకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కరోనా అన్నది కొత్తగా వచ్చిన వ్యాధి కాబట్టి అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వేళ దోపిడిని మానుకోవాలని సూచించారు. కరోనాను ఒక అవకాశంగా తీసుకుని సంపాదించుకోవాలనే ఆలోచన వదులుకోవాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Similar News