సౌత్ ఇండియా స్టార్ హీరో.. కోలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న తమిళ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి ఆయనకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో హుటహుటిన చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. అవసరమైన పరీక్షలు చేసిన వైద్యులు కమల్హాసన్ కు చిన్నపాటి ట్రీట్మెంట్ చేసి ఈ రోజు ఉదయం డిశ్చార్జి చేసినట్లు తెలిసింది. కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నట్లు సమాచారం. గతంలో కమల్ హాసన్ కరోనా వైరస్ బారినపడ్డారు. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో భాగంగానే కమల్కు జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇటీవల కమల్ హాసన్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్ ది హిట్’ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోనే ‘విక్రమ్ 3’లో కూడా త్వరలోనే కనిపించనున్నారు. బుధవారం రోజే కమల్ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు… దర్శకుడు కె.విశ్వనాథ్ను కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు.