రేవంత్ నీ ధిమాక్ కరాబ్ అయ్యింది.. సీఎం స్థాయి దిగజార్చకు
పనిచేయ చేతకాక పనికి మాలిన మాటలేంది : మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

పనిచేయ చేతకాక పనికి మాలిన మాటలేంది : మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధిమాక్ ఖరాబ్ అయ్యిందని.. చిల్లర మాటలతో సీఎం స్థాయిని దిగజార్చవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పీఠం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ది మాత్రం పెరగలేదన్నారు. పని చేయడం చేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నడని మండిపడ్డారు. కేసీఆర్ కు కాదు.. ఎవరికి ఈ సమాజంలో జీవించే హక్కులేదో కొడంగల్, కొండారెడ్డిపల్లిలో అడుగుదామా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వచ్చే దమ్ముందా.. తెలంగాణ సమాజమంతా ఛీ కొడుతున్నది.. దుమ్మెత్తి పోస్తున్నదని అన్నారు. ''ఎలుక తోలు తొచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే సామెతను అక్షరాల చాటుకుని రేవంత్ రెడ్డి తన దిగజారుడుతానాన్ని మరోమారు ప్రదర్శించారు.. సీఎం పదవిలో ఉండి చిచోరా భాష మాట్లాడుతున్నరు.. రాహుల్ గాంధీ మీద నీకున్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎట్లా రేవంత్? ముఖ్యమంత్రిగా ఎవ్వరూ గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్పై ప్రేలాపనలా అని నిలదీశారు.
కేసీఆర్ను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్లో ఉంటావేమో.. కానీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కెసీఆర్ స్థానమే ప్రజల హ్రదయాల్లో పదిలమని తెలుసుకో అన్నారు. ''రేవంత్ రెడ్డి ఇదే భాషను కొనసాగించాలనుకుంటే ఆయన జనజీవన స్రవంతిలో ఉండటానికే అర్హుడు కాడు.. తెలంగాణని ఆవిష్కరించిన కేసీఆర్ను బహిష్కరిస్తావా.. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా.. మా బహిష్కరణ నీ వల్ల కాదు గాని, నీ నిష్క్రమణకు సమయం దగ్గర పడుతున్నది.. సామాజిక బహిష్కరణ చేయాల్సివస్తే ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న నిన్ను చేయాలి రేవంత్.. నాడైనా నేడైనా తెలంగాణ ద్రోహుల భాషే రేవంత్ భాష .అందుకే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా దుర్భాషలాడుతున్నారు... సీఎం లేకి తనాన్ని.. చిల్లర మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకున్నది.. ప్రజాస్వామ్య పంథాలోనే ప్రజలు రేవంత్ కు దిమ్మదిరిగే సమాధానం ఇస్తరు..'' అని తేల్చిచెప్పారు.
కులగణన పేరుతో కుటిల రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సర్వే సరైంది కాదని ప్రజలే కాదు కాంగ్రెస్ నాయకులే తూర్పార పడుతున్నారని.. కులగణన చేయలే.. గాడిద గుడ్డు చేయలేదని స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్సీనే విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయినా సిగ్గులేకుండా కేసీఆర్ గురించి, తమ గురించి మాట్లాడుతున్నావా అని మండిపడ్డారు. రేవంత్ కు సత్తా ఉంటే సొంత పార్టీ నాయకులను ఒప్పించి కులగణన సర్వేలో వచ్చివన్నీ ఖచ్చితమైన గణాంకాలేనని చెప్పించాలని సవాల్ విసిరారు. ''ప్రభుత్వం చేసిన కుల సర్వే ఉత్త ఎన్నికల గిమ్మిక్కే.ప ఫెయిల్యూర్ మ్యాజిక్కే.. ఒకవైపు నీ సర్వే కరెక్ట్ అంటావు.. మరోవైపు రీసర్వే అంటావు.. మీ ధమాక్ కరాబ్ అయింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటది.. సీఎం పదవి స్థాయిని నీ చిల్లర మాటలతో దిగజార్చకు. ప్రశాంత తెలంగాణ లో ఫ్యాక్షన్ వాతావరణాన్ని సృష్టించే నీ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరిగా మారబోతుంది..'' అని హెచ్చరించారు.