Telugu Global
Telangana

రేవంత్‌ పైశాచిక భాషలో పచ్చి అబద్ధాలు చెప్పిండు

పాలమూరులో పిచ్చి ప్రేలాపనలు పేలిండు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

రేవంత్‌ పైశాచిక భాషలో పచ్చి అబద్ధాలు చెప్పిండు
X

సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండని.. పిచ్చి ప్రేలాపనలు పేలిండని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకపోతుంటే ఆపడం చేతగాకపోతే నీ చేతగాని తనాన్ని గుర్తు చేసినందుకు తమ మీద రంకెలేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది నువ్వు రేవంత్ రెడ్డి. పాలు తాగి రొమ్ము గుద్దిన చరిత్ర నీది. అది చరిత్ర చెపుతున్న సత్యం.. పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు.. ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన నీ పాపమే పాలమూరుకు శాపమైంది. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక మా పొత్తు కోసం జోలె పట్టింది నువ్వు ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి, పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్. పాలమూరు ను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీలది అయితే ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డి కి ఆ రెండు పాపాల్లో వాటా ఉంది..'' అని ధ్వజమెత్తారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ చేపట్టినప్పుడు తాము కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లేమని.. అప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చామన్నారు. ''నదీ జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీనీ స్తంబింప చేసినం.. నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా.. నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా.. పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేసినా మోడీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లికే సాధ్యం.. రేవంత్ కు నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే.. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడకు, నువ్విప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రివనే విషయం మరచిపోకు.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘాతకుడివి నువ్వే. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90 శాతం పనులు పూర్తి చేసినం. మిగిలిన 10 శాతం పనులు చేయకుండా కావాలని పండపెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లివి నువ్వు.. పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తే జనం కేసీఆర్ పేరుని తలుచుకుంటరనే కుళ్లు బుద్ధితోని కావాలనే ప్రాజెక్టు పనులను పండబెట్టినవు..'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే కొడంగల్, నారాయణపేటకు కూడా నీళ్లు వస్తాయని.. రేవంత్‌ తన స్వార్థం కోసం, కమిషన్ల కోసం కొడంగల్‌ - నారాయణపేట ఎత్తిపోతల పథకాన్నీ తెరమీదకు తెచ్చారని అన్నారు. ''నీ దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట, కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లము. నిన్ను ఎన్నుకున్న ఖర్మానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట మొదలైంది.. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్.. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్.. జూరాలకు సంబంధించి కర్ణాటకలో ఉన్న ముంపు భూములకు పరిహారం చెల్లించి పూర్తిస్థాయిలో నీటిని నింపి లక్ష ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు అందించింది కేసీఆర్. ఆర్డీఎస్ కింద మీ దరిద్ర బోర్డు పాలనలో 30 నుంచి 35 వేల ఎకరాలకు మించి ఎన్నడూ సాగయ్యేది కాదు. మేము తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందించినం. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినం. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత మాది..'' అని గుర్తు చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారుతుందన్నారు. ''ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని అర్బకుడివి నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే.. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు మీద కూడా ఒక్క ఇటుక పెట్టని ఒక్క చెక్ డ్యాం కూడా కట్టని వదరుబోతువు నువ్వు.. 14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా ? చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ.. నీ పనికిమాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం. నీ సవాలను స్వీకరిస్తున్న.. ఏ రోజు చర్చ చేద్దాము, ఎక్కడ చర్చ చేద్దాము నువ్వే చెప్పు.. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా.. నీ కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా.. నీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచవలసిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ ల సంగతి సకలం చర్చిస్తా.. నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా.. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్ పై కక్ష పూరిత ఆరోపణలు చేస్తున్నవు.. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న నీ దవడనే పగలగొట్టాలి.. అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు రేవంత్ రెడ్డి.. నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడు.. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు.. అబద్దాల కోసం అజ్ఞానిలా నీ బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు రేవంత్ రెడ్డి..'' అని ధ్వజమెత్తారు.

First Published:  21 Feb 2025 8:48 PM IST
Next Story