సెక్రటేరియట్ లో తప్పిన భారీ ప్రమాదం
ఆరో అంతస్తు నుంచి ఊడిపడిన పెచ్చులు.. కారు ధ్వంసం
![సెక్రటేరియట్ లో తప్పిన భారీ ప్రమాదం సెక్రటేరియట్ లో తప్పిన భారీ ప్రమాదం](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402888-secretariat-pechulu.webp)
తెలంగాణ సెక్రటేరియట్ లో భారీ ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సీఎంవో ఆఫీసులు ఉన్న సెక్రటేరియట్ ఆరో అంతస్తు నుంచి బుధవారం రాత్రి పెచ్చులు ఊడిపడ్డాయి. అవి పడటంతో కింద పార్కింగ్ లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి కారు ధ్వంసం అయ్యింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ లో ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరో అంతస్తులో అనేక వాస్తు మార్పులు చేయించారు. మెయిన్ గేట్ ను క్లోజ్ చేశారు. అయినా ఎప్పుడో తప్ప సెక్రటేరియట్ కు రావడం లేదు. తన నివాసం లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగిస్తున్నారు. ఆరో అంతస్తులో వాస్తు మార్పుల పేరుతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని.. దీంతో గోడలు బలహీనపడి పార్టిషన్ లో పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు చెప్తున్నారు. సెక్రటేరియట్లో ప్రమాదంపై నిర్మాణ సంస్థ శాపూర్ జీ పల్లోంజి గ్రూప్ ఆఫ్ ది రికార్డుగా స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్మెంట్ వర్క్స్ లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్నారని ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని తెలిపింది. ఊడిపడిన భాగం కాంక్రీట్ వర్క్ కాదని.. స్ట్రక్షర్ కు ఎలాంటి సమస్య లేదని తెలిపింది. ఊడిపడింది జీఆర్సీ ఫ్రేమ్ మాత్రమేనని.. కేబుల్స్, లైటింగ్ కోసం డ్రిల్ చేయడంతో జీఆర్సీ డ్యామేజ్ అయ్యిందని వెల్లడించింది. ఘటనపై తాము రివ్యూ చేస్తున్నామని వెల్లడించింది. ఇదే అంశాలతో కాసేపట్లో నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.