బడే భాయ్.. చోటా భాయ్తో నయాపైసా లాభం లేదు
రేవంత్, కేంద్ర మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలే : కేటీఆర్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్పై ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణకు మోసమే చేస్తాయని మరోసారి రుజువయ్యిందన్నారు. బడే భాయ్.. చోటే భాయ్తో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీల బలమున్న బిహార్, ఏపీలకు ప్రాధాన్యమిచ్చి.. జాతీయ పార్టీలను ఆదరించిన తెలంగాణను నిండా ముంచారని ఇక్కడి ప్రజలకు మళ్లీ అర్థమైందన్నారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని కేంద్ర బడ్జెట్ తో మరోసారి రుజువైందని అన్నారు. రెండు పార్టీల నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలను గెలిపిస్తే బడ్జెట్లో రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సీఎం.. చీకట్లో బీజేపీ పెద్దలతో ఒప్పందాలు చేసుకోవడంతోనే రాష్ట్రానికి ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కాదు బీజేపీకి గులాంగిరీ చేసేందుకు అని తేలిపోయిందన్నారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప ఏనాడు తెలంగాణ కోసం గళం విప్పలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసిందన్నారు. గత బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని, ఈ బడ్జెట్ లోనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు కన్నెత్తయినా చూస్తుందేమో అని నాలుగు కోట్ల ప్రజలు ఎదురుచూశారన్నారు. కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లిందన్నారు. రానున్న ఎన్నికల కోసం బీహార్ కు బంగారుపల్లెంలో వడ్డించి.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. దేశ అత్యున్నత చట్టసభలో హామీ ఇచ్చిన విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఇన్నాళ్లయినా అమలు చేయని బీజేపీని ఇకపై రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. పక్కనున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల సహాయం అందిస్తూ తెలంగాణకు మెండి చూపించారన్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతలు, కేటాయింపులు చూస్తే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారన్నారు. దేశం ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు.