Telugu Global
Sports

ఇదేం నిద్రండి బాబు.. మ్యాచ్‌ పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు

స్పిన్నర్‌ను తీసుకోవాలనే తస్కిన్‌ను జట్టులోకి తీసుకోలేదని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు.

ఇదేం నిద్రండి బాబు.. మ్యాచ్‌ పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు
X

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడూ చూడని.. ఇంతవరకూ వినని ఒక వింత జరిగింది. ఈ వింత ఘటన గురించి విని క్రికెట్‌ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా కూడా జరుగుతుందా..? అని విస్మయం చెందారు. ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ అయిన ఆడాలని కలలు కనే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. అయితే ఆ కలలు కంటూ కుంభకర్ణుడిలా నిద్రపోవడం వల్ల ఓ ఆటగాడు.. ప్రపంచకప్‌ సూపర్-8 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఎంతకీ నిద్ర లేవకపోవడంతో ఆ ఆటగాడు లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ నిద్రపోవడం వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడంటూ బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించడం సంచలనంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘజన జరిగింది. టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆడలేదు. అయితే స్పిన్నర్‌ను తీసుకోవాలనే తస్కిన్‌ను జట్టులోకి తీసుకోలేదని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు.

భారత్‌తో మ్యాచ్‌ జరిగిన రోజు తస్కిన్ అహ్మద్ చాలా సేపు నిద్రపోయాడని, అందుకే అతను టీమ్ బస్‌ సకాలంలో ఎక్కలేదని బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి తెలిపారు. తస్కిన్‌ లేచేసరికే బస్ గ్రౌండ్‌కు చేరి, మ్యాచ్‌ కూడా మొదలైందని తెలిపాడు. జట్టు సభ్యులు ఫోన్‌ చేసినా తస్కిన్‌ అహ్మద్‌ ఫోన్‌ ఎత్తలేదని.. దీంతో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తస్కిన్‌ లేకుండానే బంగ్లాదేశ్ బరిలోకి దిగిందని ఆ అధికారి తెలిపారు. ఆలస్యంగా నిద్ర లేవడంపై తోటి ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు తస్కిన్‌ క్షమాపణలు కూడా చెప్పాడట మరి.

First Published:  3 July 2024 6:03 AM GMT
Next Story