Telugu Global
Sports

థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీల్లో ముగిసిన భారత పోటీ!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల టీమ్ టోర్నీల క్వార్టర్ ఫైనల్లోనే భారత్ పోటీ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్..థామస్ కప్ ను నిలుపుకోడంలో విఫలమయ్యింది.

థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీల్లో ముగిసిన భారత పోటీ!
X

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల టీమ్ టోర్నీల క్వార్టర్ ఫైనల్లోనే భారత్ పోటీ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్..థామస్ కప్ ను నిలుపుకోడంలో విఫలమయ్యింది.

2024- ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల ( థామస్ కప్, ఉబెర్ కప్ ) టీమ్ టోర్నీలలో భారతజట్లు విఫలమయ్యాయి. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ గ్రూపు లీగ్ లో రాణించిన భారతజట్లు..నాకౌట్ క్వార్టర్ ఫైనల్స్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాయి.

పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా, మహిళల క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్ల చేతిలో భారత్ కు పరాజయాలు తప్పలేదు.

లక్ష్యసేన్ ఒంటరిపోరాటం...

పురుషుల టీమ్ విజేతలకు ఇచ్చే థామస్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1- 3తో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. గత థామస్ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్..ప్రస్తుత టోర్నీలో అదేజోరు కొనసాగించలేకపోయింది.

మూడు సింగిల్స్, రెండు డబుల్స్ పోటీలలో భారత్ ఒక్క సింగిల్స్ పోరులోనే విజయం సాధించగలిగింది. గ్రూపులీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో ఇండోనీసియా చేతిలో 1-4తో ఓడిన భారత్ నాకౌట్ క్వార్టర్ ఫైనల్స్ లో తెల్లమొకం వేసింది.

ప్రారంభ సింగిల్స్ లో ప్రపంచ 9వ ర్యాంక్ ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ ను మూడుగేమ్ ల హోరాహోరీ పోరులో చైనాకు చెందిన ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు షి యు క్వీ అధిగమించగలిగాడు.

66 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో ప్రణయ్ 21-15, 11-21, 14-21తో ఓటమి చవిచూశాడు. మరో సింగిల్స్ పోరులో భారత యువఆటగాడు లక్ష్యసేన్ 13-21, 21-8, 21-14తో చైనాకు లీ షీ ఫెంగ్ ను కంగు తినిపించాడు. లీ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన పది మ్యాచ్ ల్లో లక్ష్యసేన్ కు ఇది 7వ గెలుపు కావడం విశేషం.

పురుషుల డబుల్స్ లో ప్రపంచ 3వ ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి సైతం మూడుగేమ్ లపాటు పోరాడినా..చైనా టాప్ ర్యాంక్ జోడీ లియాంగ్ వీ కెంగ్- వాంగ్ చాంగ్ ల చేతిలో 21-15, 11-21, 11-21తో పరాజయం చవిచూశారు.

మరో డబుల్స్ లో ధృవ కపిలృ సాయి ప్రతీక్ ల జోడీకి సైతం ఓటమి తప్పలేదు.

ఉబెర్ కప్ లోనూ అదేసీన్...

యువక్రీడాకారిణుల జట్టుతో మహిళల టీమ్ టోర్నీ బరిలోకి దిగిన భారత్ కు క్వార్టర్ ఫైనల్లోనే జపాన్ చేతిలో ఓటమి ఎదురయ్యింది. జపాన్ జట్టు 3-0 తో భారత్ పై నెగ్గడం ద్వారా సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

గ్రూపు లీగ్ దశలో కెనడా, సింగపూర్ జట్లను చిత్తు చేసిన భారత్..క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అదేజోరు కొనసాగించలేకపోయింది.

First Published:  3 May 2024 10:34 AM GMT
Next Story