Telugu Global
Sports

ఏటీపీ ర్యాంకింగ్స్ లో సుమిత్ నగాల్ పైకి..పైపైకి!

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ తన ర్యాంక్ ను మరింతగా మెరుగు పరచుకొంటూ వస్తున్నాడు.

ఏటీపీ ర్యాంకింగ్స్ లో సుమిత్ నగాల్ పైకి..పైపైకి!
X

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ తన ర్యాంక్ ను మరింతగా మెరుగు పరచుకొంటూ వస్తున్నాడు.

భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు ముందే తన కెరియర్ లో అత్యుత్తమ ర్యాంక్ సంపాదించాడు. ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అత్యుత్తమంగా 68వ స్థానంలో నిలిచాడు.

గత నెల ర్యాంకింగ్స్ ప్రకారం 71వ స్థానంలో నిలిచిన సుమిత్ మూడుస్థానాల మేర తన స్థానాన్ని మెరుగు పరచుకోగలిగాడు.

శశి మీనన్ ను మించిన సుమిత్...

1973లో భారత డేవిస్ కప్ ఆటగాడు శశిమీనన్ అత్యుత్తమంగా సాధించిన 71వ ర్యాంక్ ను 26 సంవత్సరాల సుమిత్ అధిగమించాడు. భారత టెన్నిస్ పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారిలో విజయ్ అమృత్ రాజ్ ( 1980లో 18వ ర్యాంక్ ), రమేశ్ కృష్ణన్ ( 1985లో 23వ ర్యాంక్ ), సోమ్ దేవ్ వర్మన్ ( 2011 లో 62వ ర్యాంక్ ) మాత్రమే ఉన్నారు. 1973 తరువాత అత్యుత్తమ పురుషుల సింగిల్స్ ర్యాంక్ సాధించిన ఆటగాడి ఘనతను మాత్రం సుమిత్ దక్కించుకోగలిగాడు.

ఏటీపీ తాజా ర్యాంకింగ్‌ ప్రకారం 779 ర్యాంకింగ్ పాయింట్లతో సుమిత్ 68వ స్థానంలో నిలిచాడు.

2024 ఆస్ట్ర్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో పాల్గొనడంతో పాటు పలు సంచలన విజయాలు సాధించడం ద్వారా సుమిత్ తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగు పరుచుకోగలిగాడు.

95 నుంచి 68వ ర్యాంక్ కు...

ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 68వ స్థానంలో నిలవడం ద్వారా సుమిత్ ఒలింపిక్స్ బరిలో నిలవడానికి అర్హత సాధించాడు. గతంలో పురుషుల సింగిల్స్ 95వ ర్యాంక్ లో నిలిచిన సుమిత్ పలు గ్రాండ్ స్లామ్ టోర్నీలు, ఏటీపీ టూర్ పోటీలలో సంచలన విజయాలు సాధించడం ద్వారా ర్యాంకింగ్ ను అనూహ్యంగా మెరుగు పరచుకోగలిగాడు.

ర్యాంకింగ్స్ ప్రాతిపదికన వివిధ దేశాల ఆటగాళ్లకు ఒలింపిక్స్ బెర్త్ లను నిర్వాహక సంఘం కేటాయిస్తూ వస్తోంది. ఫ్రాన్స్ నాలుగు కు నాలుగు కోటా బెర్త్ లను సొంతం చేసుకోగా..భారత్ ఒకే ఒక్క స్థానాన్ని సుమిత్ రూపంలో దక్కించుకోగలిగింది.

ఒలింపిక్స్ సింగిల్స్ లో 64 మంది పోటీ...

పారిస్ వేదికగా జులై- ఆగస్టు మాసాలలో జరుగనున్న 2024 ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో భారత నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

పారిస్ ఒలింపిక్స్ పురుషుల, మహిళల సింగిల్స్ లో ర్యాంకింగ్స్ ఆధారంగా కేవలం 64 మంది అత్యుత్తమ క్రీడాకారులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. ఒలింపిక్స్ పురుషుల , మహిళల సింగిల్స్ , డబుల్స్ విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం 64 మంది క్రీడాకారులు, లేదా జట్ల నడుమ మాత్రమే పోటీజరుగుతుంది.

మొత్తం 64 మందిలో ముగ్గురు అదృష్టవంతులకు మాత్రమే ఒలింపిక్స్ పతకాలు సాధించే అవకాశం ఉంటుంది.

2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో పాల్గొన్న సమయంలో సుమిత్ ర్యాంక్ 138 కాగా.. ప్రస్తుత ఒలింపిక్స్ లో 68 కావడం విశేషం.

ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 56 స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు నేరుగా ఒలింపిక్స్ డ్రాలో తలపడే అవకాశం ఉంది. మిగిలిన 8 బెర్త్ లను వివిధ దేశాలు తమతమ కోటా కింద దక్కించుకోవాల్సి ఉంటుంది.

అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో లియాండర్ పేస్ పాల్గొని కాంస్య పతకం సాధించిన తరువాత..ఒలింపిక్స్ సింగిల్స్ బరిలో నిలిచిన మరో భారత ఆటగాడు 26 సంవత్సరాల సుమిత్ నగాల్ మాత్రమే.

ఫ్రెంచ్ ఓపెన్ వేదిక రోలాండ్ గారోస్ క్లేకోర్టుల్లోనే పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ కు ముందు..జులై 1 నుంచి జరిగే 2024 వింబుల్డన్ గ్రాస్ కోర్టు సమరంలో సుమిత్ నగాల్ పాల్గోనున్నాడు. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి.

First Published:  19 July 2024 5:27 AM GMT
Next Story