Telugu Global
Sports

కలల కారుతో సిరాజ్ హుషార్!

భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు తనన కలల కారు సంపాదించుకోగలిగాడు. బీఎమ్ డబ్లు స్థాయి నుంచి లాండ్ రోవర్ కారు ఓనర్ స్థాయికి ఎదిగాడు.

Siraj Purchases His Dream Car
X

భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు తనన కలల కారు సంపాదించుకోగలిగాడు. బీఎమ్ డబ్లు స్థాయి నుంచి లాండ్ రోవర్ కారు ఓనర్ స్థాయికి ఎదిగాడు.

హైదరాబాదీ స్టార్ క్రికెటర్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన మరో కలను సాకారం చేసుకోగలిగాడు. ఓ ఆటోడ్రైవర్ కొడుకు అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లాండ్ రోవర్ కు ఓనర్ కాగలిగాడు.

హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన 30 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకూ బీఎమ్ డబ్లు బ్రాండ్ కారు కు మాత్రమే యజమానిగా ఉన్నాడు. ఎప్పటికైనా తనకు అత్యంత ఇష్టమైన లాండ్ రోవర్ కారును కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.


టెస్ట్ క్రికెటర్ గా బీఎమ్ డబ్లు....

ఆస్ట్ర్రేలియా గడ్డపై తన టెస్టు అరంగేట్రం చేసిన తరువాత బీఎమ్ డబ్లు కారు కొనుగోలు చేసిన మహ్మద్ సిరాజ్...ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంతో బీసీసీఐ నుంచి 5 కోట్ల రూపాయలు నజరానాగా అందుకొన్నాడు. అంతేకాదు..ఐపీఎల్ కాంట్రాక్టు ద్వారా బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి ఏటా 7 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటూ వస్తున్నాడు.

భారత్ తరపున సిరాజ్ ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్ కు 15 లక్షల రూపాయలు, వన్డేకి 7 లక్షలు, టీ-20 మ్యాచ్ కు 4 లక్షల రూపాయలు చొప్పున మ్యాచ్ ఫీజుగా అందుకొంటున్నాడు.

వివిధ రూపాలలో ఏడాదికి 25 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్న సిరాజ్ ఎట్టకేలకు తనకు అత్యంత ఇష్టమైన లాండ్ రోవర్ కారును కొనుగోలు చేయగలిగాడు.

లాండ్ రోవర్ కంపెనీ నుంచి తాను తన కుటుంబసభ్యులతో కలసి అందుకొన్న కారు ఫోటోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో సిరాజ్ పంచుకొన్నాడు.

ఆ భగవంతుని కృప కారణంగానే తాను కలల కారును కొనుగోలు చేయగలిగానని, ఆ దేవుడికి సదా రుణపడి ఉంటానని, ఆ దైవం ఆశీసులు తనకు సదా ఉండాలని కోరుకొంటున్నట్లు ప్రకటించాడు.

కలలకు హద్దులు ఉండవు- సిరాజ్

కలలకు, కోరికలకు పరిమితులు, హద్దులు అంటూ ఏవీ ఉండవని, కలలు కనటం, ఆ కలల కోసం శ్రమించటమే మనం చేయవలసిన పని అంటూ సిరాజ్ తన అభిమానులతో మనసులో మాటను చెప్పుకొన్నాడు.

ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన కొన్నిరోజులకే సిరాజ్ తన కలలు కారును దక్కించుకోగలిగాడు.

రోజుకు 200 రూపాయల సంపాదన నుంచి...

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్ కాగా..తల్లి పాచిపనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ ఉండేది. సిరాజ్ సైతం క్యాటరింగ్ పనికి వెళుతూ రుమాలీ రోటీలు చుట్టేవాడు. చదువు ఏమాత్రం అబ్బక పోడంతో తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండటం కోసం క్యాటరింగ్ బృందంలో చేరిపోయాడు.

రుమాలీ రోటీలు చేస్తూ రోజుకు 200 రూపాయలు సంపాదించేవాడు.

తన సంపాదనలో 50 రూపాయలు ఉంచుకొని, మిగిలిన 150 రూపాయల మొత్తం ఇంటిఖర్చుల కోసం ఇచ్చేవాడు. క్రికెట్ ఆడటానికి తగిన దుస్తులు, ఓ ఫాస్ట్ బౌలర్ కావటానికి తగిన పరికరాలు, హంగులు కూడా తనకు లేవని సిరాజ్ గుర్తు చేసుకొంటూ ఉంటాడు తమను పెంచి పెద్దచేయటానికి తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని సిరాజ్ తీవ్రభావోద్వేగానికి గురవుతూ ఉంటాడు. రుమాలీ రోటీలు చేసిన రోజు తన చేతులు బొబ్బలెక్కేవని, మండిపోతూ ఉండేవని చెప్పుకొచ్చాడు. తాను ఎంత ఎదిగినా గతాన్ని గుర్తు చేసుకొంటూనే ఉంటానని సిరాజ్ గర్వంగా చెప్పాడు.

వెతుక్కొంటూ వచ్చిన అవకాశాలు..

విపరీతమైన పోటీ ఉన్న క్రికెట్లో ఎక్కువమంది అవకాశాల కోసం కొందరు ఎదురుచూస్తుంటే...అవకాశాలే కొందరిని వెతుక్కొంటూ రావడం సిరాజ్ విషయంలో నిజమయ్యింది.

ఐపీఎల్ 13వ సీజన్లో అంచనాలకు మించి రాణించడంతో సిరాజ్ జీవితమే మారిపోయింది. ఐపీఎల్ ప్రదర్శనతో ఏకంగా భారతజట్టులోనే పాగా వేయగలిగాడు.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి పడరాని పాట్లు పడ్డాడు. ఓ దశలో క్రికెట్ నుంచి విరమించుకొందామని కూడా భావించాడు. భారత జట్టు సభ్యుడిగా వరుస వైఫల్యాలతో తీవ్రనిరాశకు గురైన సిరాజ్ 2019-20 సీజన్లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ప్రయత్నించాడు.

2017 న్యూజిలాండ్ టీ-20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన సిరాజ్ ఆ వెంటనే జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి 2019 వన్డే సిరీస్ ద్వారా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్ నిలదొక్కుకోలేకపోయాడు.

తండ్రిమరణాన్ని దిగమింగి.....

క్రికెట్ సంపాదనతో అమ్మను పని మాన్పించిన సిరాజ్...ఆస్ట్ర్రేలియా పర్యటనకు వెళ్ళిన సమయంలోనే తండ్రిని కోల్పోయాడు. కరోనా, క్వారెంటైయిన్ నిబంధనల కారణంగా స్వదేశానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు. తన ఉన్నతి కోసం పాటుపడిన తండ్రి మరణాన్ని దిగమింగుకొని ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోయాడు.ఆ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్లు గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో అందుబాటులో లేకపోడం సిరాజ్ కు కలసి వచ్చింది.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు...గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున సత్తా చాటుకోడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సిరాజ్ సాంప్రదాయటెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి సిరాజ్ మరి వెనుదిరిగి చూసింది లేదు.

అరుదైన ఘనత....

ఆటోరిక్షా డ్రైవ‌ర్ కుమారుడి స్థాయి నుంచి భారత టెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన సిరాజ్‌.. టీమిండియా త‌ర‌పున ఆడిన రెండ‌వ హైదరాబాదీ ఫాస్ట్ బౌల‌ర్‌. గ‌తంలో స‌య్యిద్ అబిద్ అలీ భారత్ కు ఫాస్ట్ బౌలర్ గా సేవలు అందించాడు. అబిద్ అలీ 1966లో అడిలైడ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 55 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. అయితే..భారత్ త‌ర‌పున టెస్టు బరిలో నిలిచిన 298వ ప్లేయ‌ర్‌గా సిరాజ్ రికార్డుల్లో చేరాడు. మెల్‌బోర్న్ టెస్టు రెండుఇన్నింగ్స్ లోనూ కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా సిరాజ్ జట్టు విజయంలో తనవంతు పాత్ర నిర్వరించాడు.

2023 వన్డే ప్రపంచకప్ లో పాల్గొన్న సిరాజ్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడిన ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపైన విశ్వరూపమే ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లోనూ చెలరేగిపోయాడు.

ఒకదశలో రోజుకు 200 రూపాయలు సంపాదించడానికి రుమాలీ రోటీలు చుడుతూ నానాపాట్లు పడిన సిరాజ్ ప్రస్తుతం క్రికెటర్ గా నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదగటం అద్భుతం కాక మరేమిటి.

సిరాజ్ తన ఫిట్ నెస్ ను, ఫామ్ ను కాపాడుకోగలిగితే మరో ఐదేళ్లపాటు భారత క్రికెట్ కీలక ఫాస్ట్ బౌలర్ గా సేవలు అందించే అవకాశం ఉంది. అంతేకాదు..సిరాజ్ కు తెలంగాణా ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో 600 గజాల ఇంటిస్థలాన్ని ఉచితంగా అందచేసింది.

First Published:  12 Aug 2024 8:43 AM GMT
Next Story