Telugu Global
Sports

పాక్ స్వర్ణవిజేతకు 3 లక్షలు- భారత రజత విజేతకు 50 లక్షలు!

ఒలింపిక్స్ పతక విజేతలకు ఇచ్చే నజరానాల విషయంలో భారత్ కు, పాక్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

పాక్ స్వర్ణవిజేతకు 3 లక్షలు- భారత రజత విజేతకు 50 లక్షలు!
X

ఒలింపిక్స్ పతక విజేతలకు ఇచ్చే నజరానాల విషయంలో భారత్ కు, పాక్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రోలో మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా పాక్ సంచలనం అర్షద్ నదీమ్, భారత స్టార్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించారు. అయితే..ఈ ఇద్దరూ తమతమ ప్రభుత్వాల నుంచి అందుకొనే నజరానాల విషయంలో మాత్రం ఎంతో అంతరం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

గ్రామస్తుల చందాలతో ఒలింపిక్స్ కు అర్షద్...

జావలిన్ త్రో ఫైనల్లో అర్షద్, నీరజ్ పాల్గొన్న సమయంలో అందరూ...నీరజ్ చోప్రానే హాట్ ఫేవరెట్ గా, స్వర్ణపతకం సాధించడం ఖాయమనే భావించారు. అయితే..ఫలితం తారుమారయ్యింది.

92.97 మీటర్ల రికార్డు త్రోతో అర్షద్ అనూహ్యంగా బంగారు పతకం గెలుచుకొంటే..నీరజ్ చోప్రా మాత్రం 89.45 మీటర్ల రికార్డుతో రజత పతకానికే పరిమితమయ్యాడు.

ఆసియాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పురుషుల జావలిన్ త్రోలో మొదటి రెండుస్థానాలలో నిలవడం ఇదే మొదటిసారి.

గత 4 దశాబ్దాలలో పాక్ కు తొలిస్వర్ణం...

ఒలింపిక్స్ చరిత్రలో పాకిస్థాన్ గత నాలుగు దశాబ్దాల కాలంలో తొలి స్వర్ణపతకం సాధించింది, గతంలో పురుషుల హాకీ క్రీడలో మూడు బంగారు పతకాలు సాధించిన భారత్..వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం గెలుచుకోడం ఇదే మొదటిసారి. 32 సంవత్సరాల విరామం తరువాత పాకిస్థాన్ ఒలింపిక్స్ పతకం సాధించడంలో 32 సంవత్సరాల అర్షద్ నదీమ్ కీలకపాత్ర పోషించాడు.

అప్పుల కుప్పలా...దివాళాస్థితిలో కూరుకుపోయిన్ పాకిస్థాన్ కు అర్షద్ తన బంగారు విజయంతో కొత్తఊపిరి పోశాడు. ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అవసరమైన ఖర్చులను, శిక్షణకు అసరమైన ధనాన్ని అర్షద్ గ్రామస్థులే చందాలు వేసుకొని మరీ భరించారు.

3లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించిన పాక్ ప్రధాని..

తమదేశానికి లేకలేక వ్యక్తిగత విభాగంలో తొలి బంగారు పతకం అందించిన అర్షద్ కు పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ 10 లక్షల పాకిస్థాన్ రూపాయలను నజరానాగా ప్రకటించారు. అది మన భారత రూపాయలలో కేవలం 3 లక్షల రూపాయలకు మాత్రమే సమానం.

పారిస్ నుంచి ఇస్లామాబాద్ కు తిరిగి రావటానికి అయ్యే విమానచార్జీలకే ఈ మూడు లక్షల రూపాయలు సరిపోదని, కేవలం 10 లక్షల పాకిస్థానీ రూపాయలు ప్రోత్సాహక బహుమతి గా ప్రకటించి పాక్ ప్రధాని తమ స్వర్ణవిజేతను అవమానించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

పాకిస్థాన్ లోని భారత సంతతి ప్రముఖ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తమ ప్రధానని ఎండగట్టాడు. ఇంత తక్కువ మొత్తంలో ప్రోత్సాహక నగదుబహుమతిని ప్రకటించకుండా ఉండి ఉండాల్సిందంటూ చురకలు అంటించాడు.

అయితే..అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య తొలిసారిగా ప్రకటించిన 50వేల డాలర్లు ( 47 లక్షల రూపాయల ) ప్రైజ్ మనీ మాత్రం అర్షద్ సొంతం కానుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలలో స్వర్ణ విజేతలకు మాత్రమే తొలిసారిగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య 50 వేల డాలర్లు చొప్పున నజరానాగా ప్రకటించింది.

మన నీరజ్ చోప్రాకు 50 లక్షలు....

అదే మన బల్లెంవీరుడు నీరజ్ చోప్రా ఒలింపిక్స్ రజత పతకం సాధించడం ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయలు ప్రోత్సాహక నగదుబహుమతిగా అందుకోనున్నాడు.

గత ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన నీరజ్ ప్రస్తుత ఒలింపిక్స్ ప్రత్యేక శిక్షణ కోసం భారత ప్రభుత్వం 48 లక్షల 76వేల రూపాయలు ఖర్చు చేసింది.

అయినా..నీరజ్ మాత్రం స్వర్ణం కోసం పోరాడినా ప్రయోజనం లేకపోయింది.

First Published:  10 Aug 2024 11:37 AM GMT
Next Story