Telugu Global
Sports

ఒలింపిక్స్ కు నీరజ్ చోప్రా శిక్షణ ఖర్చు 48 లక్షలు!

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీమొత్తంలోనే ఖర్చు చేసింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో శిక్షణ సదుపాయాలు కల్పించింది.

ఒలింపిక్స్ కు నీరజ్ చోప్రా శిక్షణ ఖర్చు 48 లక్షలు!
X

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీమొత్తంలోనే ఖర్చు చేసింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో శిక్షణ సదుపాయాలు కల్పించింది.

పారిస్ వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒలింపిక్స్ బెర్త్ లు సాధించే భారత అధ్లెట్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే 33వ వేసవి ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు తలపడబోతున్నారు. భారత్ సైతం 130కి పైగా అథ్లెట్ల బృందంతో పాల్గోనుంది.

2020 టోక్యో ఒలింపిక్స్ లో....

టోక్యో వేదికగా ముగిసిన 32వ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ 124 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొని ఓ స్వర్ణంతో సహా మొత్తం 7 పతకాలు సాధించింది. నీరజ్ చోప్రా స్వర్ణపతకంతో చరిత్ర సృష్టిస్తే..మరో రెండు రజత, నాలుగు కాంస్యపతకాలు భారత్ కు దక్కాయి.

ఏడు పతకాలు సాధించినా పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో మాత్రమే భారత్ చోటు దక్కించుకోగలిగింది. అయితే..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో భారత అథ్లెట్లను కేంద్ర క్రీడాప్రాధికార సంస్థ తీర్చి దిద్దుతోంది.

'టాప్స్ ' పథకం ద్వారా శిక్షణ..

ఒలింపిక్స్ లో పతకం సాధించే సత్తా కలిగిన అథ్లెట్లను ముందుగానే గుర్తించి..వారికి అత్యాధునిక శిక్షణ కల్పించడం కోసం భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 17 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

'టాప్స్ ' ( టార్గెట్ ఒలింపిక్ పోడియం ) పథకం ద్వారా కోట్ల రూపాయలను అథ్లెట్లకు వివిధ రూపాలలో అందచేసింది. మిషన్ ఒలింపిక్ సెల్ అథ్లెట్ల శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. విదేశాలలో సైతం శిక్షణ పొందటానికి అథ్లెట్లకు అనుమతి ఇచ్చింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ కోసం 6 కోట్ల 25 లక్షలు...

'టాప్స్ ' పథకం కింద ఎంపికైన ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుల శిక్షణ కోసమే భారత ప్రభుత్వం 6 కోట్ల 25 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం 5 కోట్ల 77 లక్షలు, షూటింగ్ క్రీడాకారుల కోసం 3 కోట్ల 83 లక్షలు, టెన్నిస్ ఆటగాళ్ల కోసం కోటీ 57 లక్షలు, పారా అథ్లెట్ల కోసం కోటీ 17 లక్షలు, కుస్తీ క్రీడాకారుల కోసం 55 లక్షలు, వెయిట్ లిఫ్టర్ల కోసం 43 లక్షలు, బాక్సర్ల కోసం 36 లక్షలు, విలువిద్య క్రీడాకారుల కోసం 20 లక్షలు, స్విమ్మర్ల కోసం 15 లక్షల రూపాయలు వెచ్చించింది.

బంగారు పతకం కోసం భారీవ్యయం..

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే అంత తేలికకాదు. క్రీడాకారుల స్వేదం, త్యాగానికి ప్రభుత్వం పెట్టే కోట్లాదిరూపాయల ఖర్చు తోడైతేనే ఆశించిన లక్ష్యం సాధించే అవకాశం ఉంటుంది.

భారత్ కు కచ్చితంగా బంగారు పతకం సాధించే సత్తా కలిగిన జావలిన్ త్రో స్టార్ , గత ఒలింపిక్స్ లో స్వర్ణ విజేత నీరజ్ చోప్రా కోసం 'టాప్స్ ' పథకంలో భాగంగా 48 లక్షల 76వేల రూపాయలు ఖర్చు చేశారు.

పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా 176 రోజులపాటు విదేశీ ( దక్షిణాఫ్రికా, ఫిన్ లాండ్, జర్మనీ, టర్కీ)గడ్డ పైనే నీరజ్ శిక్షణ పొందాడు. 2023 డిసెంబర్ నుంచి 2024 మే వరకూ కేవలం నీరజ్ కోసమే భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది.

పీవీ సింధు శిక్షణ ఖర్చు 26 లక్షలు...

రియో ఒలింపిక్స్ రజత, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత ,తెలుగుతేజం పీవీ సింధు శిక్షణ కోసం 26 లక్షల 60 వేల రూపాయలు వెచ్చించారు. 36 రోజులపాటు విదేశాలలో శిక్షణ పొందడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పతకానికి సింధు గురిపెట్టింది.

టోక్యో ఒలింపిక్స్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ రజత విజేత మీరా బాయి చాను విదేశీ శిక్షణ కోసం 42 లక్షల 54వేల రూపాయలు వ్యయం చేశారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ కేంద్రంగా రెండు నెలలపాటు మీరాబాయి శిక్షణ తీసుకొంది.

రోహన్ బొపన్న ఖర్చు కోటీ రూపాయలు...

టెన్నిస్ డబుల్స్ లో భారత వెటరన్ ఆటగాడు , 44 సంవత్సరాల రోహన్ బొపన్న శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ కోటీ 3 వేల రూపాయలు ఖర్చు చేసింది. విదేశీ శిక్షకులతో పాటు ఫిజియో సేవలను సైతం రోహన్ అందుకొన్నాడు.

టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ 6 లక్షల 20 వేల రూపాయలు, మహిళా వస్తాదు వినేశ్ పోగట్ 33 లక్షల 7 వేలు, అవినాశ్ సాబ్లే, పారుల్ చౌదరి, హర్మిలాన్ బెయిన్స్ కలసి కోటీ 79 లక్షల రూపాయలు, నిషాద్ కుమార్,మరియప్పన్ తంగవేలు 39 లక్షల 83 వేల రూపాయలు, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ 4 లక్షల 41వేలు, బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ 9 లక్షల 33 వేల రూపాయల మేర 'టాప్స్ ' పథకం కింద లబ్ది పొందినవారిలో ఉన్నారు.

అథ్లెట్ల శిక్షణ కోసం పెట్టిన కోట్ల రూపాయల ఖర్చుకు తగిన ఫలితం వస్తుందో...రాదో తెలుసుకోవాలంటే..ఆగస్టు వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  19 Jun 2024 8:00 AM GMT
Next Story