Telugu Global
NEWS

హుందాతనం చాటి.. అభిమానుల మనసు గెలిచి.. - బన్నీ తాజా నిర్ణయంపై హర్షాతిరేకాలు

బన్నీకి ప్యాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసి.. తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉండాలని కోరింది.

హుందాతనం చాటి.. అభిమానుల మనసు గెలిచి.. - బన్నీ తాజా నిర్ణయంపై హర్షాతిరేకాలు
X

నటన విషయంలోనే కాకుండా సామాజిక బాధ్యతల విషయంలోనూ ముందుండే అల్లు అర్జున్‌ తాజాగా ఓ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించి తన హుందాతనాన్ని చాటుకున్నారు. తద్వారా అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. అభిమానులను తప్పుదోవ పట్టించి, వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని ఆయన తేల్చిచెప్పారట. వరల్డ్‌ టుబాకో డే సందర్భంగా ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బన్నీకి ప్యాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసి.. తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉండాలని కోరింది. ఆ ఆఫర్‌ని ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారట. అంతేకాదు.. ఈ యాడ్‌ చేస్తే రూ.10 కోట్ల వరకూ ఇస్తామని ఆఫర్‌ చేసినా, చేయనని స్పష్టంగా చెప్పారట. నేరుగా తీసుకోకపోయినా ’పుష్ప: ది రూల్‌’లో పుష్పరాజ్‌ ధూమపానం చేసే ప్రతి సీన్‌ లోనూ బ్యాక్‌గ్రౌండ్‌లో తమ బ్రాండ్‌ లోగో కనిపించేలా చూడాలని ఆ సంస్థ కోరిందట. అందుకు కూడా బన్నీ నో చెప్పారట.

నటనకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతల విషయంలో కూడా ముందుండే అల్లు అర్జున్‌.. ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమానికి తనవంతు ప్రచారం చేస్తూ, అభిమానులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో తాజా పరిణామంతో ఆయన నిర్ణయంపై అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 Jun 2024 4:13 AM GMT
Next Story