Telugu Global
National

నీట్‌ ఫలితాలు పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ప్రకటించాలి.. - ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం

ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అలాగని గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది.

నీట్‌ ఫలితాలు పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ప్రకటించాలి.. - ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం
X

నీట్‌–యూజీ ఫలితాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. నీట్‌–యూజీ పరీక్ష ఫలితాలను పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ప్రకటించాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై జూలై 22న తిరిగి విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

నీట్‌–యూజీ పరీక్షకు సంబంధించి విచారణ సందర్భంగా ధర్మాసనం.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్టుకు ఆదేశించగలమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అలాగని గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో పేపర్‌ లీక్‌ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యానించింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించకుండా ఉంచాలని స్పష్టం చేసింది.

First Published:  19 July 2024 6:06 AM GMT
Next Story