Telugu Global
National

ఇకపై మైనారిటీ మోర్చా మనకు అక్కర్లేదు

ప్రధాని మోడీ చెప్పిన నినాదాన్ని కాకుండా.. తాను చెప్పే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. జో హమారే సాత్, హమ్‌ ఉన్‌కే సాత్‌ (ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం) అనే నినాదాన్ని పలకాలని పిలుపునిచ్చారు.

ఇకపై మైనారిటీ మోర్చా మనకు అక్కర్లేదు
X

ఇకపై మనకు మైనారిటీ మోర్చా అక్కర్లేదంటూ బీజేపీ సీనియ‌ర్ నేత‌, పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాశ్‌’ అనే నినాదాన్ని చేయొద్దంటూ పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఇకపై కొత్త నినాదాన్ని పలకాలని ఆయన కార్యకర్తలకు చెప్పారు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన మైనారిటీ విభాగాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా చెప్పిన సువేందు అధికారి.. ప్రధాని మోడీ చెప్పిన నినాదాన్ని కాకుండా.. తాను చెప్పే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. జో హమారే సాత్, హమ్‌ ఉన్‌కే సాత్‌ (ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం) అనే నినాదాన్ని పలకాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా భారతీయులంతా అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ 2014లో ’సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు ముస్లిం ఓట్లు ఆశించినంత పోల‌వ్వ‌క‌పోవటంపై సువేందు అధికారి అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. 2024 ఎన్నికల్లో 12 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అయితే.. బీజేపీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. అధికార టీఎంసీ అన్నింటా విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ముస్లిం ఓటు బ్యాంక్‌ అడ్డంకిగా మారిందని సువేందు అధికారి భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First Published:  18 July 2024 5:21 AM GMT
Next Story