Telugu Global
National

భార్యను బైక్‌కి కట్టి.. ఊరంతా ఈడ్చుకుంటూ తిప్పి.. ఓ భర్త పైశాచికం

బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్‌ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు.

భార్యను బైక్‌కి కట్టి.. ఊరంతా ఈడ్చుకుంటూ తిప్పి.. ఓ భర్త పైశాచికం
X

తాజాగా జరుగుతున్న పలు ఘటనలు చూస్తుంటే.. మానవత్వం అనేదే మనుషుల్లో అంతర్థానమైపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజస్థాన్‌లో జరిగిన ఘటనను గమనిస్తే.. ఎవరికైనా ఆ అభిప్రాయం కలగకమానదు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను బైక్‌కి కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ ఊరంతా తిప్పి చిత్రహింసలకు గురిచేసిన ఘటన సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు మంగళవారం వివరాలు వెల్లడించారు.

నాగౌర్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌ మేఘ్వాల్‌ (40) భార్య జైసల్మేర్‌లోని తన సోదరికి ఇంటికి వెళ్లాలనుకుంది. ఆ విషయం భర్తకు చెప్పగా.. అతను అందుకు అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మద్యం తాగి వచ్చిన ప్రేమ్‌రామ్‌ తన భార్య కాళ్లను బైక్‌కి వెనుక కట్టి మట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ ఊరంతా తిప్పాడు. ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను గమనించిన పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్‌ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు. స్థానికులకు మాత్రం ఆమెను తన భార్యగా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనను మహిళల అక్రమ రవాణా కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  14 Aug 2024 3:06 AM GMT
Next Story