Telugu Global
National

మణిపూర్‌ హింస: ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ కోరిన సుప్రీం

రాష్ట్రంలోసీఎం బీరేన్‌సింగ్‌ హింసను ప్రేరేపించారంటూ.. . దీనికి సంబంధించిన ఆడియోలు లీక్‌

మణిపూర్‌ హింస: ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ కోరిన సుప్రీం
X

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రగిలిపోతున్నది. హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరేన్‌సింగ్‌ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆడియోలు కూడా లీకయ్యాయి. ఈ ఆడియో క్లిప్‌నకు సంబంధించి ప్రభుత్వ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎం బీరేన్‌ సింగ్‌కు సంబంధించి కొన్ని ఆడియోలు లీకయ్యాయి. దీంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ.. కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్‌లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అయిన 'ట్రూత్‌ ల్యాబ్స్‌' పరిశీలించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్‌.. సీఎం గొంతుతో 93 శాతం మ్యాచ్‌ అయినట్లు తేల్చిందన్నారు.

వాదనలు విన్న అనంతరం.. ఈ ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్‌ రిపోర్టును అందించాలంటూ సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్‌ లాబోరేటరీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.కాగా.. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపూర్‌ అట్టుడుకుతున్నది. హింస కారణంగా ఇప్పటివరకు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను నిలువరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న క్రమంలోనే హింసను ప్రేరేపించారంటూ సీఎం బీరేన్‌ సింగ్‌పై ఆరోపణలు గుప్పుమనడం కలకలం సృష్టిస్తున్నాయి.

First Published:  3 Feb 2025 3:14 PM IST
Next Story