పీజీ మెడికల్లో స్థానిక కోటాపై సుప్రీం కోర్టుకు తెలంగాణ
విచారణకు స్వీకరించిన జస్టిస్ గవాయ్ బెంచ్
![పీజీ మెడికల్లో స్థానిక కోటాపై సుప్రీం కోర్టుకు తెలంగాణ పీజీ మెడికల్లో స్థానిక కోటాపై సుప్రీం కోర్టుకు తెలంగాణ](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402424-supreme-court-new.webp)
పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టును ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్టికల్ 371 (డీ) ప్రకారం పదేళ్ల పాటు మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో స్థానికత వర్తిస్తుందన్న అంశాన్ని తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఏపీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వంద మంది విద్యార్థులు తమకు తెలంగాణలో స్థానిక కోటా వర్తిస్తుందని హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వివరించారు. జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తమ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం జోక్యం చేసును పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడానికి ముందు తాము విచారణ చేపడుతామని వెల్లడించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వారికి మాత్రమే స్థానిక కోటా వర్తిస్తుందని.. ఆర్టికల్ 371 (డీ)ని ఏపీ విద్యార్థుల విషయంలో పదేళ్ల పాటు మాత్రమే అమలు చేయాలన్న నిబంధనను తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని వివరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 200 మంది సీమాంధ్ర ప్రాంతంలో ఎంబీబీఎస్ చదివిన వారు తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లు పొందారని వివరించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.