ఢిల్లీ, బిహార్ లో భూప్రకంపనలు
తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదు

ఢిల్లీ, బిహార్ లో భూ ప్రకంపనలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. సోమవారం ఉదయం నేషనల్ క్యాపిటల్ ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. తర్వాత కొన్ని గంటల్లోనే బిహార్ లోనూ భూకంపం వచ్చింది. ఢిల్లీలో ఉదయం 5:35 గంటల ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూమి కంపించింది. ఢిల్లీతో పాటు గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. బిహార్ లో ఉదయం 8:20 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు. సివాన్ లో 10 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఉదయాన్నే భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలో పరుగులు పెట్టారు. అపార్ట్మెంట్లు, కరెంట్ స్తంభాలు ఊగాయాని.. భారీ శబ్దం కూడా వచ్చిందని కొందరు చెప్తున్నారు. ఢిల్లీ, బిహార్ భూకంపాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఢిల్లీలో మళ్లీ భూకంపం వచ్చే అవకాశముందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సరైన భద్రత చర్యలు పాటించాలని సూచించారు.