Telugu Global
National

భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి

పోలీసు దళాల జాడను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా కాల్పులు కొనసాగాయి.

భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి
X

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం నాగపూర్‌కు తరలించారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న వన్డోలీ అడవుల్లో బుధవారం ఈ ఘటన జరిగింది.

వన్డోలీ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో సీ60 పోలీసు దళాలు బుధవారం ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసు దళాల జాడను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా తిప్పగడ్డ దళానికి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వారిలో దళ ఇన్‌చార్జి లక్ష్మణ్‌ ఆత్రం అలియాస్‌ విశాల్‌ ఉన్నాడు. మృతుల్లో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మూడు ఏకే–47 తుపాకులతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్టు సమాచారం.

First Published:  18 July 2024 2:23 AM GMT
Next Story