Telugu Global
International

అదృశ్యమైన విమానం కూలిపోయింది.. - మలానీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి

ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి.

అదృశ్యమైన విమానం కూలిపోయింది.. - మలానీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి
X

జూన్‌ పదో తేదీ సోమవారం నాడు ఆఫ్రికాలోని మలానీలో అదృశ్యమైన విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని గుర్తించారు. ఈ ఘటనలో మలానీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది మృతిచెందినట్టు దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం వెల్లడించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్నవారంతా మృతిచెందారని ఈ సందర్భంగా తెలిపారు.

సోమవారం నాడు మలానీ రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన మలానీ సైన్యం భారీగా గాలింపు చేపట్టింది.

ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్‌ కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయని మలానీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్టు మంగళవారం తెలిపింది.

First Published:  11 Jun 2024 4:17 PM GMT
Next Story