Telugu Global
International

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌!

ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటు వేయగా పెజెష్కియాన్‌కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌!
X

ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌ విజయం సాధించారు. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. పిడివాదిగా పేరుపొందిన సయీద్‌ జలిలితో పోటీపడి ఆయన గెలుపొందారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంస్కరణవాదిగా పేరున్న మసౌద్‌.. హృద్రోగ నిపుణుడు.

ఈ ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటు వేయగా పెజెష్కియాన్‌కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇరాన్‌ను ఆంక్షల చట్రం నుంచి బయటకు తీసుకురావడం కోసం పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని పెజెష్కియాన్‌ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షులు హసన్‌ రౌహానీ, మహమ్మద్‌ ఖాటామి మద్దతు ఉంది.

రన్‌ ఆఫ్‌ పోలింగ్‌లో విజేతగా..

ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికల కోసం జూన్‌ చివరిలోనే పోలింగ్‌ జరిగినప్పటికీ.. నాటి పోలింగ్‌లో దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో జూలై 5న రెండో బ్యాలెట్‌ నిర్వహించారు. దీనినే రన్‌ ఆఫ్‌ బ్యాలెట్‌ అంటారు. గత కొన్నేళ్లుగా ఇరాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపలేదని సమాచారం. ఇద్దరు అభ్యర్థులను, వ్యవస్థను తిరస్కరించడానికే వారు ఇలా చేశారని మునుపటి ఓటింగ్‌ గురించి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 50 శాతం పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్‌ చట్టాలు చెబుతున్నాయి. అలా రానప్పుడు.. అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ అఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. ఇలా 2005లో ఒకే ఒక్కసారి జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా రన్‌ ఆఫ్‌ పోలింగే.

First Published:  7 July 2024 3:57 AM GMT
Next Story