Telugu Global
International

ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేయాలి: ట్రంప్‌

ఇరాన్‌ చమురు కేంద్రాలపై కాకుండా ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయం ఆలోచించాలని బైడెన్‌ సూచన

ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేయాలి: ట్రంప్‌
X

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ఇటీవల ఇజ్రాయెల్‌పై జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా దాడులు జరుగుతాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నార్త్‌ కరోలినాలోని ఫయెట్‌విల్లేలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్‌ చేశారు. అలాగే ఇరాన్‌ అణుకేంద్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందుందనే అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన స్పందించలేదు. ఈ క్రమంలోనే బైడెన్‌ వైఖరిని ట్రంప్‌ తప్పపట్టారు. ఇరాన్‌ ఇటీవల ఇజ్రాయెల్‌పై చేసిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేయాలని సూచించారు. తర్వాత వాటి గురించి చింతించాలన్నారు.

నేనైతే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాను:బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వైట్‌ హౌస్‌ వద్ద విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ పరిస్థితిలో తాను ఉండి ఉంటే చమురు కేంద్రాలపై దాడి చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై ఇజ్రాయెల్‌ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నదని వెల్లడించారు. ఆ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. అలాగే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయం జరుగుతాయని విశ్వసిస్తున్నానని.. అయితే అవి ప్రశాంతంగా జరుగుతాయో లేదా సందేహమే అన్నారు. ఎందుకంటే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి గతంలో చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమన్నారు.

First Published:  5 Oct 2024 4:18 AM GMT
Next Story