సీబీఐ ఆఫీస్లో దొంగలు పడ్డరు!
అన్నింటిని దోచుకెళ్లారనే నేషనల్ మీడియాలో కథనాలు

పాలసీలు రూపొందించే పొలిటీషియన్లను.. వాటిని ఇంప్లిమెంట్ చేసే బ్యూరోక్రాట్లను.. ఒకరిద్దరేమిటీ వ్యవస్థంలో చోటు చేసుకున్న ఎలాంటి ఘటనలపైన అయిన విచారణ జరిపే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆఫీస్లోనే దొంగలు పడ్డారు. ఆ ఆఫీస్లో ఉన్న ప్రతి వస్తువును ఊడ్చుకెళ్లారు. ఇప్పుడు నేషనల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. త్రిపుర రాజధాని అగర్తలాలోని ఫ్యామిలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్ లో సీబీఐ ఆఫీస్ ఉంది. ఐదు నెలలుగా అధికారులెవరూ అటువైపు వెళ్లలేదు. ఆఫీస్ మూసే ఉండటంతో దోపిడీ దొంగల కన్ను దానిపై పడింది. బయట ఎక్కడో దొంగతనం చేస్తే ఏం కిక్ ఉంటుంది అనుకున్నారేమో.. సీబీఐ ఆఫీస్ పై కన్నేశారు. కుర్చీలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రి, కిటికీలు, లోపలి డోర్లు సహా అన్నింటినీ దోచుకెళ్లారు. ఆఫీస్లో గోడలు తప్ప ఇంకేమి మిగల్చలేదు. ఐదు నెలల తర్వాత ఆఫీస్కు వెళ్లిన సీబీఐ అధికారులు ఖాళీ గోడలు, గదులను చూసి ఖంగు తిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అగర్తలా పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సామగ్రిలో కొంత స్వాధీనం చేసుకున్నారు.