Telugu Global
CRIME

వైసీపీ నేత దారుణ హత్య.. వినుకొండలో 144 సెక్షన్‌

భారీగా రక్తస్రావం కావడంతో ర‌షీద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు.

వైసీపీ నేత దారుణ హత్య.. వినుకొండలో 144 సెక్షన్‌
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యర్థి పార్టీ వైసీపీ శ్రేణుల‌పై దాడులు విపరీత‌మ‌య్యాయి. తాజాగా వినుకొండలో నడిరోడ్డుపై జరిగిన వైసీపీ నేత ర‌షీద్‌ హత్య ఏపీలో శాంతిభద్రతల ప‌రిర‌క్ష‌ణ‌ ఎలా ఉందో కళ్లకు కట్టింది. వైసీపీ యువ‌జ‌న‌ విభాగం నేత ర‌షీద్‌ని.. జిలానీ అనే వ్యక్తి న‌డిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూడ్డానికే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి.


మెడపై కొబ్బరి బొండం నరికే కత్తితో దాడి చేయడంతో ర‌షీద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు రెండు చేతులు అడ్డు పెట్టగా.. ఓ చేయి పూర్తిగా తెగిపోయి దూరంగా పడిపోయింది. భారీగా రక్తస్రావం కావడంతో ర‌షీద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ హత్యతో వినుకొండలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు పాల్పడిన జిలానీ టీడీపీ కార్యకర్తగా తెలుస్తోంది. రషీద్‌ హత్య తర్వాత జిలానీ పోలీసులకు లొంగిపోయాడు.


ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు పల్నాడు ఎస్పీ కె.శ్రీనివాస రావు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నారు. చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇక ఈ హత్యపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎస్పీగా మల్లికా గార్గ్‌ ఉన్నట్లయితే హత్య జరగకపోయి ఉండేదంటూ ట్వీట్ చేశారు.

First Published:  18 July 2024 4:02 AM GMT
Next Story