Telugu Global
CRIME

ఏపీ సీఐడీ విచారణకు ఆర్జీవీ గైర్హాజరు

సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని పేర్కొంటూ.. 8 వారాల గడువు కోరిన వర్మ

ఏపీ సీఐడీ విచారణకు ఆర్జీవీ గైర్హాజరు
X

ఏపీ సీఐడీ అధికారుల విచారణకు వివాదాస్పద డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) గైర్హాజరయ్యారు. తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని పేర్కొంటూ.. 8 వారాల గడువు కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి మంగళవారం మళ్లీ నోటీసులు ఇవ్వాలని సీఐడీ యోచిస్తున్నది.

రాంగోపాల్‌ వర్మ 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్ వేయడంతో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పేరుతో విడుదల చేశారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరితే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు మంగళగిరి సమీపంలో ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బంగారు ఫిర్యాదు చేశారు. అందులో ఉద్రేకపూరిత దృశ్యాలను తొలగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు వర్మపై మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌ 29 కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులను ఆర్జీవీకి ఇటీవల ఒంగోలులో సీఐడీ అధికారులు అందజేశారు. ఈ కేసులో విచారణకు నేడు ఆయన హాజరుకావాల్సి ఉండగా గడువు కోరారు.

First Published:  10 Feb 2025 1:01 PM IST
Next Story