Telugu Global
CRIME

పట్టపగలు నడిరోడ్డుపై ఘోరం.. - మాజీ ప్రియురాలిని కొట్టి చంపేసిన యువకుడు

పనికి వెళుతున్న యువతిని రోహిత్‌ వెంబడించి.. ఇనుప రెంచీతో దాడి చేశాడు. ఆమెను తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

పట్టపగలు నడిరోడ్డుపై ఘోరం.. - మాజీ ప్రియురాలిని కొట్టి చంపేసిన యువకుడు
X

పట్టపగలు నడిరోడ్డుపై ఘోరం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో తన మాజీ ప్రియురాలిని కొట్టి చంపేశాడో యువకుడు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోరాన్ని అక్కడున్నవారు చూస్తూ నిలుచున్నారే తప్ప ఆపేందుకు ఒక్కరూ ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించి భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ముంబయికి చెందిన రోహిత్‌ యాదవ్‌ ఒక యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వారి మధ్య పలు కారణాల వల్ల విభేదాలు రావడంతో ఆమె రోహిత్‌ని దూరంగా పెట్టింది. తనను దూరం పెట్టిన ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉంటోందేమోనని రోహిత్‌ అనుమానం పెంచుకున్నాడు. అదే పెరిగి పెనుభూతంలా మారింది. మంగళవారం ఉదయం పనికి వెళుతున్న యువతిని రోహిత్‌ వెంబడించి.. ఇనుప రెంచీతో దాడి చేశాడు. ఆమెను తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయినా వదలకుండా.. రెంచీతో పలుమార్లు తీవ్రంగా కొట్టి ఆమె ప్రాణాలు తీశాడు. కళ్ల ముందే ఇంత ఘోరం జరుగుతున్నా అక్కడి వారెవరూ ఆపేందుకు ప్రయత్నించకుండా చోద్యంలా చూడటం శోచనీయం. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

First Published:  19 Jun 2024 2:38 AM GMT
Next Story