యూపీలో హింసాత్మకంగా మారిన సర్వే
ప్రార్థన మందిరం వద్ద ఉద్రిక్తత.. ముగ్గురు మృతి

ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంభాల్ లోని ఒక ప్రార్థన మందిరంలో ఆదివారం కోర్టు ఆదేశాలతో సర్వే చేపట్టారు. ఈ సర్వేకు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో స్థానికులు గొడవ పడ్డారు. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. ప్రార్థన మందిరం వద్ద సర్వే చేస్తుండగా స్థానికులు వందలాదిగా అక్కడికి చేరుకొని గొడవపడ్డారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించారు. తర్వాత రబ్బర్ బులెట్లతో షూట్ చేశారు. బులెట్ గాయాలతో ముగ్గురు యువకులు మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. సంభాల్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.