టాటా గ్రూప్ ఛైర్మన్కు యూకే నైట్హుడ్తో సత్కారం

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కు ప్రతిష్టాత్మక ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సివిల్ డివిజన్) పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. యూకే-ఇండియా వ్యాపార సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఆయన ఈ బ్రిటిష్ ఎంపైర్ గౌరవం పొందారు. ప్రతిష్టాత్మకమైన ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సివిల్ డివిజన్)ను అందుకున్న సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. “ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దీనికి కింగ్ చార్లెస్ కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాలవ్యాప్తంగా యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలో మా సంస్థల్లో 70,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ యూనివర్సిటీ, స్వాన్సీ యూనివర్సిటీ సహా ఈ దేశంలోని అనేక గొప్ప సంస్థలతో ప్రపంచ స్థాయి పరిశోధనలు, విద్యారంగంపరమైన భాగస్వామ్యాల ఫలాలను ఆస్వాదిస్తున్నాం. గ్రూప్నకు ఎనలేని మద్దతును అందిస్తున్న యూకే ప్రభుత్వానికి టాటా గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. యూకేతో మా పటిష్ట బంధాలను, మా కార్యకలాపాలను మరింతగా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతిష్టాత్మక గుర్తింపుతో నన్ను గౌరవించినందుకు మరోసారి ధన్యవాదాలు” అని చంద్రశేఖరన్ తెలిపారు.