Telugu Global
Andhra Pradesh

నేడు మహా ధర్నా.. మరో రెండు రోజులు ఢిల్లీలోనే జగన్

టీడీపీకి వ్యతిరేకంగా తమతో కలసి వచ్చే పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఏపీ పరిస్థితిని స్వయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కి వివరించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

నేడు మహా ధర్నా.. మరో రెండు రోజులు ఢిల్లీలోనే జగన్
X

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నేడు వైసీపీ మహాధర్నా జరుగుతుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే ప్రధాన డిమాండ్ తో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ధర్నాకు దిగుతున్నారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ధర్నాతోపాటు, 50రోజులుగా ఏపీలో జరుగుతున్న వివిధ పరిణామాలపై ఫొటో ఎగ్జిబిషన్ కూడా వైసీపీ ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడ్డాక ఏపీలో జరిగిన హత్యలు, అఘాయిత్యాలను హైలైట్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.


ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కేవలం 50 రోజుల్లోనే 36 హత్యలు, 16 హత్యాచారాలు, నలుగురిపై మానభంగాలు, వెయ్యికి పైగా దాడులు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ లెక్కలన్నీ మరోసారి ధర్నాలో ప్రస్తావించబోతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా తమతో కలసి వచ్చే పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఈ ధర్నాకు సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ వస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా వారి విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వస్తుంది.

అపాయింట్ మెంట్ లు దొరికేనా..?

ఏపీ పరిస్థితిని స్వయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కి వివరించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అపాయింట్ మెంట్ లు కూడా అడిగారు నేతలు. మరి వారినుంచి సానుకూల స్పందన వచ్చిందా లేదా అనేది తేలాల్సి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రులు వైసీపీకి సమయం కేటాయిస్తారా లేదా అనేది వేచి చూడాలి. కేంద్ర పెద్దలతో భేటీకోసం జగన్ మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. మహా ధర్నా కార్యక్రమంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకుంటోంది వైసీపీ.

First Published:  24 July 2024 2:03 AM GMT
Next Story