Telugu Global
Andhra Pradesh

గుడ్లవల్లేరు హిడెన్‌ కెమెరా ఘటనపై జగన్ షాకింగ్ కామెంట్స్‌

వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

గుడ్లవల్లేరు హిడెన్‌ కెమెరా ఘటనపై జగన్ షాకింగ్ కామెంట్స్‌
X

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో లేడిస్ హాస్ట‌ల్ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాల ఏర్పాటు ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు 360కిపైగా వీడియోలు రికార్డయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. ఐతే ఈ ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదంటూ మండిపడ్డారు.

జగన్ ట్వీట్ ఇదే -

చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే విద్యావ్యస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్ని అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారంటూ జగన్‌ ఆరోపించారు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్నారు జగన్‌. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటనగా అభివర్ణించారు. చంద్రబాబు ఇకనైనా మేల్కోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, వారి భవిష్యత్తును పణంగా పెట్టొద్దని సూచించారు.

First Published:  30 Aug 2024 3:09 PM GMT
Next Story