Telugu Global
Andhra Pradesh

శాంతి నాకు కూతురు లాంటిది - విజయసాయిరెడ్డి

. ఏ పరాయి మహిళతోనూ తనకు అనైతిక, అక్రమ సంబంధాలు లేవన్నారు. తను నమ్మిన దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో కూడా ఈ మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు విజయసాయి.

శాంతి నాకు కూతురు లాంటిది - విజయసాయిరెడ్డి
X

దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్ శాంతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై మరోసారి వివరణ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్న విజయ సాయిరెడ్డి.. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్‌ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటిసారి కలిశానన్నారు విజయసాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు శాంతిని కూతురుగానే భావించానన్నారు. శాంతికి ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానన్నారు. తనకు కొడుకు పుట్టాడని తెలిస్తే వెళ్లి పరామర్శించానన్నారు. ఇక తాడేపల్లిలోని తన ఇంటికి వస్తే ఆశీర్వదించానన్నారు విజయసాయి. ఏ పరాయి మహిళతోనూ తనకు అనైతిక, అక్రమ సంబంధాలు లేవన్నారు. తను నమ్మిన దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో కూడా ఈ మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు విజయసాయి.

కొద్ది రోజులుగా శాంతి వ్యవహారంపై మీడియా ఛానళ్లు హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. శాంతికి పుట్టిన కొడుక్కి తండ్రి విజయసాయిరెడ్డేనని ఆమె మొదటి భర్త మదన్‌మోహన్‌ ఆరోపిస్తున్నారు. అయితే మదన్‌ ఆరోపణలను శాంతి ఖండిస్తోంది. 2016లో పెద్దల సమక్షంలో మదన్‌మోహన్‌, తాను విడిపోయామని చెప్తోంది. తన కొడుక్కి తండ్రి సుభాష్‌ అని చెప్తోంది శాంతి. అయితే బిడ్డకు డీఎన్‌ఏ టెస్టు చేయించాలని మదన్‌మోహన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఇదే అదునుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని న్యూస్‌ ఛానళ్లపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇటీవల మహా న్యూస్‌ ఛానల్‌ ఎండీ వంశీకృష్ణకు లీగల్ నోటీసులు సైతం పంపారు. తప్పుడు ఉద్దేశాలతో, నిరాధార వార్తలు ప్రసారం చేశారని, తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా వ్యవహరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

First Published:  20 July 2024 5:27 AM GMT
Next Story