Telugu Global
Andhra Pradesh

నరసాపురం MPDO కేసులో వీడిన మిస్టరీ

ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందని బయటకు వెళ్లిన ఆయన.. తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్‌ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 16వ తేదీన అందరూ జాగ్రత్త అంటూ భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపారు.

నరసాపురం MPDO కేసులో వీడిన మిస్టరీ
X

నరసాపురం MPDO వెంకటరమణ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కొంతకాలంగా కనిపించకుండాపోయిన వెంకటరమణ విగతజీవిగా కనిపించారు. ఏలూరు కాల్వలో MPDO వెంకటరమణ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. SDRF బృందాలు డెడ్‌బాడీని వెలికితీశాయి. ఈనెల 15 నుంచి MPDO కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.


వెంకటరమణ విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన జూలై 10 నుంచి 20 వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందని బయటకు వెళ్లిన ఆయన.. తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్‌ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 16వ తేదీన అందరూ జాగ్రత్త అంటూ భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపారు.

వెంకటరమణ మెసేజ్‌తో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత వెంకటరమణ కారును మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు.. విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో ఆయన కోసం గాలించారు. వెంకటరమణ మొబైల్‌ సిగ్నల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్‌ ఏలూరు కాల్వ దగ్గర కట్‌ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాల్వలో దూకినట్లు భావించిన పోలీసులు.. ఇవాళ ఆయన డెడ్‌బాడీని గుర్తించారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించిన వ్యవహారమే వెంకటరమణ మృతికి కారణంగా అనుమానిస్తున్నారు.

First Published:  23 July 2024 9:22 AM GMT
Next Story