Telugu Global
Andhra Pradesh

మేడమ్, నేరాలు తగ్గించండి..! అదే పనిలో ఉన్నానండి

జనసేన నేత నాగబాబు.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను నాగబాబు ట్విట్టర్ ద్వారా ప్రజల ముందు ఉంచారు.

మేడమ్, నేరాలు తగ్గించండి..! అదే పనిలో ఉన్నానండి
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకుల పలకరింపులు వారి సంభాషణలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఏపీ అసెంబ్లీలో కూడా పరస్పర పొగడ్తలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. చంద్రబాబుని పవన్ కల్యాణ్ పొగడటం, పవన్ ని చంద్రబాబు ఆకాశానికెత్తేయడం అందరూ చూస్తూనే ఉన్నాం. ఇక అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్, పవన్.. ఈ ముగ్గురిలో ఎవరు మాట్లాడుతున్నా సభ్యులంతా బల్లలు చరుస్తూ సందడి చేస్తున్నారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో మూడు పార్టీల పొగడ్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అసెంబ్లీలోనే కాదు, బయట కూడా ఈ పార్టీ నేతలకు ఆ పార్టీ నేతలు, వారికి వీరు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. తాజాగా జనసేన నేత నాగబాబు.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను నాగబాబు ట్విట్టర్ ద్వారా ప్రజల ముందు ఉంచారు.


ఏపీలో ఇటీవల నేరాల సంఖ్య పెరిగిపోతోందని వైసీపీ ఆరోపిస్తోంది. హత్యలు, అత్యాచారాలు, దాడుల కేసులు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఈ విషయాన్ని హోం మంత్రి వద్ద నాగబాబు ప్రస్తావించారట. ఆడబిడ్డలపై జరిగే అవాంఛనీయ సంఘటనలు అరికట్టాలని, నేరాల శాతాన్ని తగ్గించాలని తాను కోరానని, అదే పనిలో ఉన్నానని ఆవిడ స్పందించారని అన్నారు నాగబాబు. ఆమె స్పందించిన తీరు అభినందనీయం అని చెప్పారు. సరైన వ్యక్తి కి, మంచి వ్యక్తికి హోం శాఖ రావడం సంతోషకరం అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు నాగబాబు. ఇలా కూటమిలో ఒకరికొకరు ఎలివేషన్లు ఇచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది.

First Published:  25 July 2024 6:54 AM GMT
Next Story