ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికారప్రతినిధి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఫైబర్నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికారప్రతినిధి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. 'వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసం.. అందించిన మద్దతుతో పాటు కీలక బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీడీపీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఏ రాజకీయపార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు' అని జీవన్రెడ్డి పేర్కొన్నారు.
జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ఆ సంస్థలో జరుగుతున్న వివాదంపై నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయనను జీఏడీకి రిపోర్టు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.