Telugu Global
Andhra Pradesh

హిడెన్ కెమెరా చుట్టూ రాజకీయం

కాలేజీ హాస్టల్ లో ఉన్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇటు రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

హిడెన్ కెమెరా చుట్టూ రాజకీయం
X

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. ఆ ఘటన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని, ఇప్పుడు బయటపడిందని టీడీపీకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. నిందితుడు జగన్ అభిమాని అని, మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ టీడీపీని విమర్శిస్తూ రీల్స్ కూడా చేశారని సాక్ష్యాలు చూపెడుతున్నారు. ఇటు వైసీపీ కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తోంది. నిందితుడి సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే పవన్ కల్యాణ్ అభిమాని అని తెలుస్తోందని వైసీపీ సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కూడా తీవ్ర విమర్శలు కనిపించాయి. ఆ కాలేజీ టీడీపీ సానుభూతిపరుడిది అని కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు టీడీపీ రంగంలోకి దిగిందని అంటున్నారు.


ఫేక్ న్యూస్ అంటూ..

గుడ్లవల్లేరు ఘటన జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. నేషనల్ మీడియా కూడా వరుస కథనాలిస్తోంది. ఇంత పెద్ద ఘటన జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు కొంతమంది ప్రయత్నిస్తుండటం దారుణం అంటున్నారు విద్యార్థినులు. వీడియోలపై నిన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తే విచారణకి 30 రోజులు గడువు ఇవ్వాలని మేనేజ్ మెంట్ కోరిందని చెప్పారు. అయితే విషయం బయటకు రావడంతో అది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారని, తిరిగి తమపైనే రివర్స్ కేసులు పెడతామంటున్నారని, కొంతమంది విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని ఆయన చెప్పారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నానని ఆమె చెప్పారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు హోం మంత్రి.


సినిమా సీన్ ని తలపించేలా..

రాజుగారి గది-2 అనే సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉంటాయి. హీరోయిన్ సమంత స్నానం చేస్తుండగా, ఆమె ఫ్రెండ్ బాత్ రూమ్ లో సెల్ ఫోన్ పెట్టి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బయట పెడుతుంది. ఇక్కడ కూడా హాస్టల్ గదిలో హిడెన్ కెమెరాలు పెట్టింది మరో అమ్మాయే కావడం, వాటిని తన స్నేహితులకు ఆమె పంపించడం సంచలనంగా మారింది. కాలేజీ హాస్టల్ లో ఉన్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

First Published:  30 Aug 2024 7:37 AM GMT
Next Story