Telugu Global
Andhra Pradesh

త్వరలో విశాఖ ఫైల్స్.. గంటా మరో సంచలనం

కాశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ సిద్ధం చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

త్వరలో విశాఖ ఫైల్స్.. గంటా మరో సంచలనం
X

ఎన్నికల ఫలితాల తర్వాత రుషికొండ భవనాలను వెలుగులోకి తీసుకొచ్చి, వైసీపీ ని కార్నర్ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో బాంబు పేల్చారు. త్వరలో విశాఖ ఫైల్స్ పేరుతో ఓ సిరీస్ విడుదల చేస్తామన్నారు. విశాఖలో భూ దందాలన్నిటినీ అందులో బయటపెడతామన్నారు గంటా. వైసీపీ భూదందాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పిస్తామన్నారాయన.

కాశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ సిద్ధం చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈసారి గంటాకు మంత్రి పదవి లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని అనుకున్నారంతా. కానీ వైసీపీని టార్గెట్ చేస్తూ గంటా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య రుషికొండ భవనాల వద్దకు తనతోపాటు మీడియాని కూడా తీసుకెళ్లి హడావిడి చేశారు. అక్కడి బాత్రూమ్ లు, బాత్ టబ్ లు, ఇతర కాస్ట్ లీ ఫర్నిచర్ వ్యవహారమంతా అప్పుడే బయటపడింది, నేషనల్ మీడియాలో కూడా పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ గంటా తెరపైకి వచ్చారు. విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామంటున్నారు.

విశాఖ విషయంలో వైసీపీని పూర్తిగా టార్గెట్ చేయాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. విశాఖను రాజధానిగా ప్రకటించినా కూడా అక్కడ వైసీపీకి మెజార్టీ లభించలేదు. మరోవైపు అమరావతిని హైలైట్ చేస్తూనే విశాఖలో తమకు వ్యతిరేకత పెరగకుండా చూసుకుంటున్నారు టీడీపీ నేతలు. రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు కబ్జాలకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని చెప్పారు.

First Published:  14 July 2024 8:52 AM GMT
Next Story