Telugu Global
Andhra Pradesh

పనిగట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు

తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.

పనిగట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు
X

కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు తప్పులను ఎల్లో మీడియా దాచేస్తోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాలనలో అంతా బాగుందన్నట్టుగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

వారిపై త్వరలో పరువు నష్టం దావా..

తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పెద్దిరెడ్డి విమర్శించారు. గత రెండు నెలల కాలంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్ల బకాయి పడిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారని, రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  15 Aug 2024 11:06 AM GMT
Next Story