Telugu Global
Andhra Pradesh

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రమాదంలో భాగ్యశ్రీ, నితిన్‌కుమార్, కమలాదేవి అక్కడికక్కడే మృతిచెందగా, నాగషణ్ముఖ్‌, డ్రైవర్‌ వంశీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
X


సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద ఈ ప్ర‌మాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.



తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని భాగ్యశ్రీ (26), రాచాబత్తుని నాగ నితిన్‌ కుమార్‌ (2), పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొమ్మా కమలాదేవి (53) హైదరాబాద్‌ నుంచి రాజవోలుకు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కారు.. ల‌క్ష్మీనగర్‌ వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.




ఈ ప్రమాదంలో భాగ్యశ్రీ, నితిన్‌కుమార్, కమలాదేవి అక్కడికక్కడే మృతిచెందగా, నాగషణ్ముఖ్‌, డ్రైవర్‌ వంశీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ రవికుమార్, ఎస్సై సతీష్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. భాగ్యశ్రీ హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

First Published:  8 July 2024 6:34 AM GMT
Next Story