Telugu Global
Andhra Pradesh

ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
X

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా.. 2024–25 సంవత్సరానికి గాను ఈ ఫీజులు వర్తిస్తాయి. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు.

ఫీజులు ఖరారైన కాలేజీల్లో లక్ష రూపాయలు పైన ఫీజు ఉన్నవి 8 ఉండగా, రూ.40 వేల ఫీజు ఉన్న కాలేజీలు 114 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజు ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ ఫీజులోకే వస్తాయి. వీటి కోసం కళాశాలలు అదనంగా వసూలు చేయకూడదు.

వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెండింగులో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు లోబడి ఫీజులు ఉంటాయని పేర్కొంది.

విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు, గుంటూరులోని ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ కళాశాలలకు అత్యధికంగా రూ.1.05 లక్షల చొప్పున ఫీజు ఖరారు చేశారు. ఇక విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షల ఫీజు ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ. 93,700గా ఖరారు చేశారు.

First Published:  8 July 2024 7:05 AM GMT
Next Story