Telugu Global
Andhra Pradesh

హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే శ్వేత పత్రాలు

ఇప్పటికే ఉచిత ఇసుక కొండెక్కిందని, తల్లికి వందనం పథకం అమలులో కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సూపర్‌ సిక్స్, పవన్‌ కళ్యాణ్‌ షణ్ముఖ వ్యూహానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారో, ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే శ్వేత పత్రాలు
X

సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు అప్పులపై అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీ, కూటమి నేతలు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ తెస్తున్నారని, ఈ నెల రోజుల్లోనే పరిమితికి మించి అప్పు చేశారని నాని చెప్పారు.

పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై వారు చేసిన విష ప్రచారం మొత్తం అవాస్తవమన్న విషయం బయటపడుతుందనే భయంతోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ గురించి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదన్నారు. అట్టహాసంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులివ్వలేకే పూర్తిస్థాయి బడ్జెట్‌కు వెనకాడుతున్నారన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నది రూ.100 కోట్లు మాత్రమేనని, అయినప్పటికీ తాము ఆ ఏడాది జూలై 12న పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని పేర్ని నాని గుర్తుచేశారు.

ఇప్పటికే ఉచిత ఇసుక కొండెక్కిందని, తల్లికి వందనం పథకం అమలులో కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సూపర్‌ సిక్స్, పవన్‌ కళ్యాణ్‌ షణ్ముఖ వ్యూహానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారో, ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రహస్యంగా బిల్స్‌ పాస్‌ చేసేందుకు, కేటాయింపులు, శాఖల డిమాండ్లు కూడా చూపించాల్సిన అవసరం ఉండదనే ఆర్డినెన్స్‌ లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు వెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.30 నుంచి రూ.60 మాత్రమే చెత్త పన్ను వసూలు చేశామని, ఇప్పుడు చెత్తకు రోజుకు రూ.3 పన్ను వసూలు చేయాలని పవన్‌ అంటున్నారని, ఇప్పుడు ఎవరు చెత్త సీఎం అని పేర్ని నాని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.

మీడియా ముసుగులో కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, ఆయన వివరణ తీసుకోకుండా, కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా, ఏకంగా ఒక ఛానల్‌ సీఈవోనే డిబేట్‌ పెట్టడం, అందులో నీచంగా మాట్లాడటం పూర్తిగా దిగజారిపోవడమే అని మండిపడ్డారు. పార్టీ మహిళా కార్యకర్తలతో టీవీలో తిట్టించడం దుర్మార్గమన్నారు. విజయసాయిరెడ్డి గానీ, చంద్రబాబు గానీ, పేర్ని నాని గానీ.. ఎవరైనా సరే.. ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు మీడియా హుందాగా ప్రవర్తించాలన్నారు. ముందుగా వాటికి ఆధారాలున్నాయేమో చూడాలని, ఆధారాల్లేకపోతే ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని, అయితే ఇప్పుడు మీడియాలో ఇది జరగడంలేదని ఆక్షేపించారు.

First Published:  17 July 2024 3:56 AM GMT
Next Story