Telugu Global
Andhra Pradesh

ఏపీలో మరో హత్య.. ఇది కూడా నడిరోడ్డుపైనే

హత్యల్లో ఏపీ, బీహార్‌ని తలపిస్తోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఏపీలో మరో హత్య.. ఇది కూడా నడిరోడ్డుపైనే
X

ఏపీలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ హత్యలు కూడా ఎక్కడో దారికాచి, గుర్తు తెలియని వ్యక్తులు, నిర్మానుష్య ప్రాంతాల్లో చేస్తున్నవి కావు. పట్ట పగలు, నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా జరుగుతున్నవి. వినుకొండ ఘటన కళ్లముందు కదలాడుతుండగానే.. ధర్మవరం మండలం కొత్తకోటలో మరో మర్డర్ జరిగింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన సూర్య నారాయణ అనే వ్యక్తిని నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు ప్రత్యర్థులు. అయితే ఇది ఎవరిపని, ఎందుకు చేశారనేది బయటకు రాలేదు.


వినుకొండలో హత్య జరుగుతుండగా ఎవరో సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వ్యవహారం సంచలనం అయింది. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే కత్తితో రషీద్ ని తెగనరికాడు జిలానీ. ఇది పూర్తిగా రాజకీయంగా మారింది. రషీద్ వైసీపీ సానుభూతిపరుడని, జిలానీ టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. సాక్ష్యాలుగా ఫొటోలు కూడా చూపిస్తున్నారు. రాజకీయాల సంగతి పక్కనపెడితే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా హత్య జరగడం ఏపీలో సంచలనంగా మారింది. ధర్మవరం ఘటన కూడా నడిరోడ్డుపై జరిగిందే. అయితే ఇక్కడ హత్య జరిగేటప్పుడు ఎవరూ వీడియో తీయలేదు. శవం రోడ్డుపై పడి ఉండటంతో ఈ వ్యవహారం అందరికీ తెలిసింది.

బీహార్ లా ఏపీ..

హత్యల్లో ఏపీ, బీహార్‌ని తలపిస్తోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ఈనెల 24న ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమయ్యారు వైసీపీ నేతలు. జాతీయ స్థాయిలో టీడీపీ రాజకీయ దాడుల్ని ఎండగడతామని అంటున్నారు. ఒక హత్య హాట్ టాపిక్ గా ఉండగానే మరో హత్య జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

First Published:  20 July 2024 5:40 AM GMT
Next Story